దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుంది

– రైతుబంధుతో అన్నదాతల్లో సంతోషం
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అంటే దండగ
– తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చుతున్నాం
– రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కేసీఆర్‌ ప్రత్యేక కృషి
– డిప్యూటీ సీఎం కడియం
– జయశంకర్‌ జిల్లాలో చెక్కులు పంపిణీ చేసిన కడియం
జయశంకర్‌ భూపాలపల్లి, మే12(జ‌నం సాక్షి) : సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం జిల్లాలోని వెంకటాపురం మండలం రామానుజపురం గ్రామంలో రైతుబంధు కార్యక్రమంలో శ్రీహరి పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌, ఎంపీ ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌, కలెక్టర్‌ అమేయకుమార్‌ తో పాటు స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటే.. కరెంట్‌ రాక, విత్తనాలు, ఎరువులు దొరకక, పొలాలు ఎండిపోయి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఎరువులు, విత్తనాల కోసం క్యూలో నిలబడి, చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితి ఉండేదన్నారు. తాను స్టేషన్‌ ఘన్పూర్‌ ఎమ్మెల్యే గా ఉన్నపుడు జనగామలో ఎరువుల కోసం ఉప్పలయ్య అనే రైతు గంటల తరబడి
క్యూలో నిలబడి అక్కడ ఎరువులు అయిపోతే ఇంకొక చోట దుకాణంలో ఇస్తున్నారంటే పరిగెత్తుతూ అలిసి కుప్పకూలి పోయి అక్కడే చనిపోయారన్నారు. దానికి నిరసనగా నేను ఆందోళన చేస్తే ఇప్పటికీ ఆ కేసు నా విూద ఉందని కడియం తెలిపారు. కానీ ఈ నాలుగేళ్లలో ఎరువులు, విత్తనాల కోసం ఎపుడైనా క్యూలో నిలబడ్డారా? లేదు. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని, ఉచిత కరెంట్‌, ఎరువులు, విత్తనాలు, కోటి ఎకరాలను మాగాణ చేసే లక్ష్యంతో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం, 38 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయల పంట రుణాల మాఫీ, ఇప్పుడు ఎకరానికి రెండు పంటలకు 8000 రూపాయల పంట పెట్టుబడి ఇస్తున్నామని చెప్పారు.
రామానుజపురానికి హైస్కూల్‌ మంజూరు..
రామానుజపురం గ్రామంలో ఈ ఏడాది నుంచి హైస్కూల్‌ మంజూరు చేస్తున్నా. ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇందుకు 6 అదనపు గదులు, 60 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. విూ పిల్లలందరిని సర్కారు బడుల్లోనే చేర్పించాలని, ఒక్క ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌ ఈ ఊరు నుంచి బయటకు పోవద్దన్నారు. విూ ఊరు వాళ్లంతా కలిసి తీర్మానం చేసి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని కడియం సూచించారు.
————————————–