దేశ ప్రజలను విడగొట్టేందుకు.. కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది
– కాంగ్రెస్ రాజకీయం.. ప్రారంభం, ముగింపు వారసత్వంతోనే నడుస్తోంది
– భాజపా మాత్రమే పేదలకోసం పనిచేస్తుంది
– నోట్ల రద్దు కారణంగా నల్లధనం వివరాలు వెలుగులోకి వచ్చాయి
– ఛత్తీస్గఢ్ను నక్సల్ రహిత ప్రాంతంగా మార్చుతాం
– ఛత్తీస్గఢ్ మలిదశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
బిలాస్పూర్, నవంబర్12(జనంసాక్షి) : దేశ ప్రజలను విడగొట్టేం విధంగాకాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని, అలాంటి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సోమవారం ఛత్తీస్గఢ్లోని రెండో దశ పోలింగ్ నిమిత్తం బిలాస్పూర్లో నిర్వహించిన భాజపా ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలను విడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ప్రారంభం, ముగింపు వారసత్వంతోనే నడుస్తోందని విమర్శించారు. కానీ భాజపా ప్రారంభం, ముగింపు మాత్రం పేద ప్రజల కోసం పని చేస్తుందన్నారు. భాజపాతో ఎలా పోరాడాలనే విషయం ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు తెలియడం లేదన్నారు. మేం అభివృద్ధి విూద దృష్టి పెడతామని ప్రధాని తెలిపారు. ఛత్తీస్గఢ్లో విూరు ఎక్కడికెళ్లినా అభివృద్ధి విూకు కనిపిస్తోందని, కానీ ప్రతిపక్షాలు మాత్రం కులం పేరుతో ప్రజలను విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా నల్లధనం వివరాలు వెలుగులోకి వచ్చాయని మోదీ తెలిపారు. అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న కంపెనీలను అధికారులు గుర్తించగలిగారని, గతంలో ఇళ్లలో అక్రమంగా భారీస్థాయిలో నగదును దాచుకున్నారని, కానీ నోట్లరద్దు తర్వాత ఆ నగదంతా బయటకు వచ్చిందన్నారు. అదంతా విూ డబ్బు అని మోదీ తెలిపారు. ఒక్కభాజపా మాత్రమే ఛత్తీస్గఢ్ను నక్సల్ రహిత ప్రాంతంగా మార్చగలుగుతోందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నాయని, వాళ్లని విప్లవకారులుగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి మోదీ చురకలు వేశారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఇటీవల 36 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసిందని, ఇందులో నామ్దార్ను సర్ అని 150సార్లు సంబోధించారు. దీన్ని బట్టే అర్థం అవుతోంది వాళ్లకు ఛత్తీస్గఢ్ కంటే అతనే(రాహుల్) ముఖ్యమనే విషయం అంటూ మోదీ చురకలు వేశారు.