ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ

– ముగ్గురు యువకులు మృతి
– పరారీలో లారీ డ్రైవర్‌
విశాఖపట్టణ, ఫిబ్రవరి12 (జ‌నంసాక్షి) విశాఖపట్నం జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎస్‌.రాయవరం మండలం డి అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లారీ ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులూ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. వీరిని అగ్రహారం గ్రామానికి చెందిన ఆర్‌.నవీన్‌(18), కె. వరప్రసాద్‌ (16), కార్తీక్‌ (16)లుగా గుర్తించారు. ముగ్గురు యువకులూ ద్విచక్ర వాహనంపై యలమంచిలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్రహారం కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా తుని నుంచి విశాఖవైపు వెళ్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు
యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో వరప్రసాద్‌ మృతదేహాన్ని లారీ ఈడ్చుకెళ్లగా అది యలమంచిలి మండలం పులపర్తి వద్ద లభ్యమైంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళనకు దిగి, జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, గ్రామస్థులతో చర్చించారు. వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.