నా ఇల్లమ్మి రాహుల్గాంధీకి విమానం కొంటా
– రాహుల్ నిజాయితీ కలిగిన నేత
– అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది
– తాను సేకరించిన డబ్బును ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి పంపిస్తా
– మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత అశోక్జైస్వాల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్5(జనం సాక్షి) : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోసం అత్యంత భద్రతతో కూడిన విమానం కొనేందుకు తన ఇల్లు, దుకాణాలు అమ్ముతానని ఓ కాంగ్రెస్ నేత ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత అశోక్ జైస్వాల్ ఈ మేరకు పత్రికలో ప్రకటన కూడా ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో రాహుల్గాంధీ ప్రయాణిస్తున్న విమానం కర్ణాటకలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. విమాన సిబ్బంది ఆలస్యంగా స్పందించడం వల్ల విమానం ఒక్కసారిగా కొంత మేర కిందకు వచ్చిందని డీజీసీఏ వెల్లడించింది. విమానం కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడింది. అయితే ఈ ఘటన తనను బాగా భయపెట్టిందని అశోక్ జైస్వాల్ తెలిపారు. అప్పుడే రాహుల్ గాంధీ కోసం ఆధునికమైన అత్యంత భద్రతతో కూడిన విమానం కొనాలని అనుకున్నానని చెప్పారు. 2019 జాతీయ ఎన్నికల ప్రచారం కోసం ఆయన దానిని ఉపయోగించొచ్చని అన్నారు. విమానం కొనేందుకు డబ్బు సేకరించాలని నిర్ణయించానని, తర్వాత ఇందుకోసం తన ఇల్లు, దుకాణాలు అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన స్నేహితులు కూడా స్వచ్ఛందంగా వారి ఆస్తులు అమ్మేందుకు సిద్ధపడ్డారని జైస్వాల్ వెల్లడించారు. పార్టీ నేతలంతా విమానం కొనేందుకు సహకరించాలని కోరారు. తాము సేకరించిన డబ్బును ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లో పార్టీ కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికలు సవిూపిస్తున్నందున రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటనలు చేయాల్సి ఉంటుందని, రాహుల్ లాంటి నిజాయితీపరుడైన నేతను తాము క్షేమంగా ఉంచుకోవాలని అనుకుంటున్నామని 40ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న జైస్వాల్ తెలిపారు. రాహుల్ గాంధీ కుటుంబం నిజాయితీపరుల కుటుంబమని, వారు దేశం కోసం గొప్ప త్యాగాలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసమే బతికారని, దేశం కోసమే చనిపోయారని అన్నారు.