నా భర్త హత్యకు ప్లాన్‌చేసింది శిఖాచౌదరినే

– తమ ఆస్తులు లాక్కునేందుకు హత్య చేయించింది

– డబ్బుకోసం ఆమె ఎంతకైనా తెగిస్తుంది

– జయరాంకు నాలుగున్నర కోట్లు ఇచ్చారనడంలో వాస్తవం లేదు

– లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి

– జయరాంతో తనకు ఎటువంటి విభేదాలు లేవు

– విలేకరుల సమావేశంలో జయరాం సతీమణి పద్మశ్రీ

హైదరాబాద్‌, జనవరి7(జ‌నంసాక్షి): తన భర్త హత్యకు శిఖా చౌదరినే కారణమని, ఆమె నా భర్తను హత్య చేయించిందని ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శిఖాప్రమేయం లేకుంటే తన భర్త చనిపోయేవారు కాదన్నారు. తమ ఆస్తులు లాక్కునేందుకే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయిందని ఆమె ఆరోపించారు. ఆమె వ్యవహారం చూసి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడినట్టు వెల్లడించారు. హత్యకు ఎ/-లాన్‌ చేసింది శిఖాయేనని స్పష్టం చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. పేద అమ్మాయి అయిన శిఖాచౌదరి నేడు బిఎండబ్ల్యూ కారులో ఎలా తిరుగుతోందని ప్రశ్నించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిందని, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం? దురదృష్టమన్నారు. జయరాం చనిపోయిన కబురు తెలిసినా తర్వాత నందిగామ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. జయరాం ఇంటికి వెళ్లి పలు కీలక పత్రాలు, విలువైన వస్తువులు తీసుకుపోయిందని ఆరోపించారు. ఎక్స్‌ప్రెస్‌ టీవీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాతే ఆ చానల్‌ నాశమైందన్నారు. రాకేష్‌ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. జయరాంకు రాకేష్‌రెడ్డి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడంతో వాస్తవం లేదని చెప్పారు. శిఖా చౌదరికే చెక్‌ పవర్‌ ఉందని వెల్లడించారు. తన భర్త అంత్యక్రియలకు ఆయన తరపు దగ్గర బంధువులు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయరాంకు మహిళలతో సంబంధాలున్నాయని వింటుంటే బాధగా ఉందని పద్మశ్రీ అన్నారు. తన భర్తతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.