నిప్పంటుకుని పూరిల్లు దగ్ధం

చిత్తూరు,మే4(జ‌నంసాక్షి): అడవికి అంటుకున్న నిప్పు వ్యాపించి పూరిల్లు దగ్ధమైన ఘటన శనివారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ గ్రామ పంచాయతీ, రాణి పురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టారు. ఆ మంటలు వ్యాపించి పూరిల్లుకు అంటుకొని పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలి గోడలు ధ్వంసమయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన కుటుంబీకులు వెంటనే బయటకు వచ్చేయడంతో.. ప్రాణాపాయం తప్పింది. కట్టుబట్టలతో నడిరోడ్డున పడిన కుటుంబీకులు రోదించారు. ఆ కుటుంబాన్ని గంగాధర నెల్లూరు నియోజకవర్గం టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి హరికృష్ణ శనివారం పరామర్శించారు.