నేటి నుంచి ఢిల్లీ అత్యాచారం కేసు విచారణ

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నేటి నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ప్రారంభంకానుంది. ఈ ఘటనలో ఐదుగురి నిందితుల విచారణతోపాటు సాక్షాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. బాధితురాలి స్నేహితుడుతోపాటు పలువురి సాక్షాలను సేకరించనుంది. ఈ కేసులో ఐదుగురి నిందితులపై కోర్టు శనివారం అభియోగాలను నమోదు చేసింది. ఆరో నిందితున్ని బాల నేరస్థుల న్యాయస్థానం మైనర్‌గా తేల్చడంతో అతనిపై విడిగా విచారణ చేపట్టనున్నారు. గత డిసెంబర్‌లో దక్షిణ ఢిల్లీలోని ఓ బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని మృత్యువుతో పోరాడి సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.