నేరస్థుడైన జగన్‌ను..మహిళలు అన్నగా అంగీకరించరు

– జగన్‌కు ఓ సిద్ధాంతం అనేది లేదు
– ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వైసీపీకి దిక్కుతోచడం లేదు
– 11న ఢిల్లీలో ధర్మపోరాటానికి పెద్దెత్తున తరలిరావాలి
– 10న ప్రధాని రాష్ట్ర పర్యటనలో నిరసన తెలుపుదాం
– ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరించరని, నేరస్థుడు ఎలా ఉండాలో తెలుసు కానీ.. అన్నగా ఎలా ఉండాలో జగన్‌కు ఎలా తెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు వ్యాఖ్యానించారు. గురువారం  తెదేపా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. జగన్‌, వైపాకా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఓ సిద్ధాంతం అనేదే లేదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో జగన్‌కు దిక్కుతోచడం లేదన్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను రూ.2వేలు ఇస్తుంటే.. తాను రూ.3వేలు ఇస్తానంటూ జగన్‌ ప్రకటించారని మండిపడ్డారు. ఈనెల 11వ తేదీన ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష పెద్ద ఎత్తున చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి దీనికి మద్దతు పలకాలన్నారు. 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి నిరసన తెలుపుదామన్నారు. సమష్టి కృషి తో ఎన్నో విజయాలు అందుకున్నామని, ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 80శాతం ఓటు బ్యాంకు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ల బందరు పోర్టు కల నేడు సాకారం చేస్తున్నట్లు సీఎం వివరించారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్‌ఐలకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారన్నారు. వైసీపీ నేతలు ఈ తరహా ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధమవుతారని, వీరి వ్యవహరంపై నిఘా పెట్టాలని నేతలకు ఆయన సూచించారు. ప్రతి వర్గాన్ని ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని ప్రకటనలు చేసినా ఇబ్బందేం ఉండదని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్ధంగా తీసుకెళ్లాలని సూచించారు. పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీనే కాకుండా.. చెక్కులు బ్యాంకుల్లో వేస్తే డబ్బులు ఇప్పించే బాధ్యతనూ నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ వ్యవహారాలపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సీఎం సూచించారు. డబ్బులు, అమలుకాని హావిూలు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకిరావడం గోడవిూద రాసిన సత్యమని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చివరికి సోనియా అల్లుడు వాద్రాను కూడా ఈడీ విచారణకు పిలిపించారన్నారు. అన్ని వ్యవస్థలను మోదీ భష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.