న్యూయార్క్‌లో క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తిగా భారతసంతతి మహిళ

హైదరాబాద్‌: న్యూయార్క్‌లోని క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తిగా తొలిసారిగా భారతసంతతికి చెందిన రాజరాజేశ్వరి అనే మహిళ నియమితులయ్యారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్‌ బిల్‌డే బ్లాసియో ఆమె చేత క్రిమినల్‌కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఆమెతోపాటు మరో 27మంది ప్రమాణస్వీకారం చేశారు. రాజరాజేశ్వరి(43) గతంలో రిచ్‌మాండ్‌ కౌంటీ జిల్లా న్యాయసలహాదారు కార్యాలయంలో పలు విభాగాల్లో పనిచేశారు. రాజరాజేశ్వరి పదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా మేయర్‌ బిల్‌ డే బ్లాసియా మాట్లాడుతూ సరైన అర్హత, నిజాయతీ ఉన్నవారు మాత్రమే న్యూయార్క్‌ ప్రజలకు అవసరమని, అలాంటివారినే న్యాయమూర్తులుగా నియమించామని తెలిపారు.