పసిడి వర్ణంలో మెరిసిన ఐష్‌

కేన్స్‌: అందాల తార ఐశ్వర్యరాయ్‌ బంగారు వర్ణం గౌనులో మెరిసిపోయారు. కేన్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో శుక్రవారం రాత్రి ఐశ్వర్య సందడి చేశారు. 42ఏళ్ల ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఈసారి అద్భుతమైన డ్రెస్‌తో మరింత అందంగా కనిపించారు. బంగారు వర్ణంలో మెటాలిక్‌షీత్‌లో మిరుమిట్లు గొలిపే గోల్డ్‌ కేప్‌ గౌన్‌లో ఎర్రతివాచీపై వయ్యారాలు ఒలకపోస్తుంటే కెమెరాలన్నీ ఆమెవైపే. ఈ డ్రెస్‌ను కువైట్‌కు చెందిన డిజైనర్‌ అలీ యోనిస్‌ రూపొందించారు. ప్రఖ్యాత కాస్మోటిక్‌ సంస్థ లోరియల్‌ పారిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఐశ్వర్య ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ ఉత్సవాల్లో పాల్గొనడం ఇది 15వ సారి.

శుక్రవారం ఐశ్వర్యరాయ్‌ కేన్స్‌లో జరిగిన స్లాక్‌ బే చిత్ర ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. శనివారం కూడా ఐష్‌ కేన్స్‌లో అలరించనున్నారు. కేన్స్‌లో ఈసారి ఆమె నటించిన ‘సరబ్‌జిత్‌’ సినిమా స్క్రీనింగ్‌ జరగనుంది. గతంలో కూడా కేన్స్‌లో ఐశ్వర్య ఎర్రతివాచీ నడకపై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఈసారి ఐశ్వర్య ఎలా కనిపిస్తుందో చూడాలి.. అని ఆత్రుతగా ఎదురుచూసే వారు ఉన్నారు. కట్టిపడేసే అందంతో.. అంతే అందమైన వస్త్రధారణతో ఐశ్వర్య ప్రతిసారీ ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఆమెకు భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.

14br52e