పాకిస్థాన్‌లోని రైలు పట్టాలపై పేలుడు: ముగ్గురి మృతి

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని మస్తంగ్‌ జిల్లాలో ఆదివారం రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. అధికారుల కథనం ప్రకారం.. మస్తంగ్‌ జిల్లాలోని దాష్ట్‌ ప్రాంతంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబును అమర్చారు. దీనిపై ఓ ప్యాసెంజరు రైలు ప్రయాణిస్తున్నప్పుడు బాంబు పేలింది. దీంతో ఓ బోగీ పక్కను ఒరిగిపోయింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. బెలుచిస్థాన్‌లోని కెట్టా నుంచి పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రవాల్‌పిండి ప్రాంతానికి రైలు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులకి పాల్పడినవారి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు.