పాకిస్థాన్ యుద్ధం కోరుకుంటుందా?: ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్

pawcrkehపాకిస్థాన్‌పై ఆప్ఘనిస్థాన్ తీవ్రంగా తప్పుబట్టింది. తాలిబన్ల విషయంలో పాక్ తీరుపై ఫైర్ అయ్యింది. తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చి, వారికి స్వర్గధామంగా నిలుస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తోందని అధ్యక్షుడు మొహమ్మద్ అష్రాఫ్ ఘనీ విరుచుకుపడ్డారు.
“తాలిబన్ల స్థావరాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. వారి కార్యకలాపాలు అక్కడి నుంచే సాగుతున్నాయి. ఈ విషయాన్ని పాక్ అధికారుల ముందుంచాం. వారిని శాంతి చర్చలకు తీసుకురాలేకపోతే, తాలిబన్లకు సాయపడటాన్ని ఆపివేయాలి. వారి స్థావరాలు మూసేసేలా సైనిక చర్యలు చేపట్టాలి. తీవ్రవాదులకు కఠిన శిక్షలు విధించాలి. గాయపడ్డవారిని ఆసుపత్రుల్లో చేర్చుకోరాదు. ఇలా చేయకుంటే, పొరుగు దేశాల నాశనాన్ని, యుద్ధాన్ని పాక్ కోరుకుంటున్నట్టే భావించాల్సి వస్తుంది” అని ఘనీ అన్నారు.
ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్న పాక్ పొరుగుదేశాలకు యుద్ధ సంకేతాలు పంపుతోందని ఘనీ చెప్పారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల వరుస దాడులపై ఘనీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పాకిస్థాన్‌తో సత్సంబంధాలకై తాము ప్రయత్నాలు చేస్తుంటే ఆ దేశం యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. తాలిబన్లతో శాంతి చర్చల విషయంలోనూ పాక్ వైఖరి తమకు అసంతృప్తి కలిగించిందన్నారు.