పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

` జనం తీర్పు కోరుదాం
` కేటీఆర్‌ డిమాండ్‌
` 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం
గద్వాల(జనంసాక్షి): పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని..ఆ తర్వాత ప్రజా తీర్పు కోరదామని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిందని, అలాంటి పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. గద్వాలను జిల్లా కేంద్రంగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.‘‘రైలు కింద తలపెడతాను కానీ, పార్టీ మారబోనని గతంలో కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడేమో అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు చెప్పారు. ఆయన పార్టీ మారుతున్నది.. నియోజకవర్గ అభివృద్ధి కోసమా..? సొంత అభివృద్ధి కోసమా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయి. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు చాలా సీరియస్‌గా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసురుతున్నా. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఎన్నికలకు రావాలి. కాంగ్రెస్‌ నేతలు యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. గ్రూప్‌-1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం అంటే..ఎవరైనా అప్పు ఇస్తారా? ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేక పోరాటంలో భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ అన్నారు.