పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్‌గురుకు ఉరి

అఫ్జల్‌గురు క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
ఉరిశిక్ష అమలుతో జమ్మూ కాశ్మీర్‌ అంతటా కర్ఫ్యూ
న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం 5.25 గంటలకు తీహర్‌ జైల్‌లో అధికారులు ఉరితీశారు. ఈ కేసులో అఫ్జల్‌గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. దాంతో అఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలు చేశారు. మరికొంత సేపట్లో ఉరిశిక్ష అమలుపై కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేయనుంది.
2001 డిసెంబక్‌ 13న ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఈ దాడిలో అఫ్జల్‌గురు ప్రధాన సూత్రధారి, ఈ కేసులో అఫ్జల్‌గురుకు 2004లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకోవడంతో ఉరిశిక్ష నిలిచిపోయింది. గత నెలలోనే అఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలుకు  కేంద్ర హోంశాఖ సిఫారను చేసింది. ఉరిశిక్ష అమలును అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్‌గురును తీహార్‌ జైలుకు తీసుకువచ్చారు.
అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుంగా జమ్మూకాశ్మీర్‌ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్‌ విధించారు.