పెట్రో ధరలతో ప్రజల ఇక్కట్లు

ఆర్థిక అసమానతలతో ప్రజల్లో ఆందోళన: చింతా
కర్నూలు,అక్టోబర్‌8 (జనంసాక్షి) : గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి పేద సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రేస్‌ నేత చింతా మోహన్‌ అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు, అర్థాకలి వలన ప్రజలు సతమతం అవుతున్నారని తెలిపారు. కేంద్రంలో ఉన్న మంత్రి కుమారుడే రైతులని జీపులు ఎక్కించి చంపితే.. సామాన్య ప్రజలకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. దేశంలో అన్నీ ప్రవేట్‌ పరం చేస్తూ బీజేపీ అమ్ముకుంటూ పోతోందని విమర్శించారు. బీజేపీ ఆధీనంలో ఉన్న గుజరాత్‌లో కోట్లాది రూపాయల డ్రగ్స్‌ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు మెస్‌ బిల్లులు రావడం లేదన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో స్కాలర్‌ షిప్‌లు అందక 80 లక్షల మంది స్టూడెంట్స్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్స్‌ పాకెట్‌ మనీ ఫీజు రియంబర్స్‌ మెంట్‌ బకాయిలు దీపావళి లోపు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి అప్పులు తెచ్చే మంత్రిగా మారిపోయాడని వ్యాఖ్యానించారు. దేశానికి మంచి చేయాలన్నా..ప్రజలకు న్యాయం జరగలన్నా కాంగ్రేస్‌తోనే సాధ్యమని చింతామోహన్‌ స్పష్టం చేశారు.