పెళ్లితో ఒక్కటైన బాలీవుడ్‌ జంట

హిందూ సంప్రదాయం మేరకు ఘనంగా పెళ్లి వేడుకలు

ముంబై,నవంబర్‌14(జ‌నంసాక్షి): బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్‌ కోమో రిసార్ట్స్‌లో కొంకణీ స్టెల్‌ వెడ్డింగ్‌తో దీపికా పదుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఓ ఇంటివాళ్లయ్యారు. దీపికా సారస్వత్‌ బ్రాహ్మిణ్‌ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు ఆమె మాతృభాష కొంకణీ. దీంతో మొదట కొంకణీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహానికి అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి కోసం దీపికా వైట్‌ అండ్‌ గోల్డ్‌ సబ్యసాచి చీరలో ముస్తాబవగా.. రణ్‌వీర్‌ కంజీవరం షేర్వాణీలో మెరిసిపోయాడు. గురువారం ఈ ఇద్దరూ సాంప్రదాయ ఆనంద్‌ కరాజ్‌ సెర్మనీలో మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. సోమవారం సాయంత్రమే ఈ ఇద్దరూ రింగ్స్‌ మార్చుకున్నారు. కొంకణీ సాంప్రదాయం ప్రకారం దీపికా తండ్రి ప్రకాశ్‌ పదుకోన్‌.. రణ్‌వీర్‌ కాళ్లు కడిగాడు. మంగళవారం ఘనంగా సంగీత్‌ సెర్మనీ జరగగా.. బుధవారం పెళ్లితో ఈ జంట ఒక్కటైంది. అయితే పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు రాకుండా దీప్‌వీర్‌ జంట జాగ్రత్త పడింది. పెళ్లికి వచ్చే అతిథులు ఫొటోలు, వీడియోలు తీయొద్దని ముందే వీళ్లు స్పష్టంగా చెప్పారు. తమ పెళ్లికి ఎలాంటి బహుమతులు ఇవ్వొద్దని, అలా ఇవ్వాలనుకుంటే దీపికా ఫౌండేషన్‌ ద లివ్‌ లవ్‌ లాఫ్‌కు ఇవ్వాలని వీళ్లు కోరిన విషయం తెలిసిందే. ఈ నెల 16న దీప్‌వీర్‌ ఇండియాకు తిరిగి రానున్నారు. ఈ నెల 21న బెంగళూరులోని లీలా ప్యాలస్‌లో తొలిసారి, నవంబర్‌ 28న ముంబైలోని గ్రాండ్‌ హయత్‌లో మరోసారి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.