పోలీస్ కాల్పుల్లో దొంగలకు గాయాలు: ముఠా సభ్యుల అరెస్ట్
పోలీస్ కాల్పుల్లో దొంగలకు గాయాలు: ముఠా సభ్యుల అరెస్ట్
న్యూఢిల్లీ,నవంబర్24(జనంసాక్షి): ఢిల్లీలోని తైమూర్ నగర్లో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులకు, దొంగలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తైమూర్ నగర్లోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో బంగ్లాదేశ్కు చెందిన దొంగల ముఠా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 10 మంది సభ్యుల పోలీసుల బృందం.. న్యూ ఫ్రెండ్స్ కాలనీకి శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు చేరుకున్నారు. దొంగలను చుట్టుముట్టిన పోలీసులు.. సరెండర్ కావాలని ఆదేశించారు. కానీ దొంగలు లొంగిపోకుండా.. పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారు. మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మొత్తంగా ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగల నుంచి పిస్తోల్స్, ఇండ్లను ధ్వంసం చేసే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.