ప్రజల్లోకి కాంగ్రెస్‌ నేతలు


నేడు ఊరూరా రాజీవ్‌ జయంతి ఉత్సవాలు
నిజామాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటినుంచే ప్రచార రంగంలోకి దూసుకుని పోయేందుకు ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించేలా చేస్తున్నారు. రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా సీనియర్‌ నేతలు కార్యకర్తలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యాక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామంలో ప్రజలను కలిసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార భేరిని మోగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. గ్రామగ్రామాన రాజీవ్‌ గాంధీ జయంతి ఉత్సవాలు జరపాలని సూచించారు. రాజీవ్‌ జయంతి సందర్భంగా మోగించనున్న ప్రచార భేరి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. నిత్యం ఇక ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్‌ను ప్రజలకు చేరువ చేస్తామని మాజీమంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. రోజు ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని, పార్టీ క్యాడర్‌ ఎంత మంది కలిసివస్తారో తెలిసిపోతుందని నాయకులు నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు సర్వశక్తులు ఒడ్డాలని సూచించారు. సాధారణ ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీలు సందడి చేయాలని భావిస్తున్నాయి.