ప్రజల సమాచారాన్ని..  ఐటీ కంపెనీలకు దారాదత్తం చేశారు


– టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడింది
– వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య
కడప, మార్చి4(జ‌నంసాక్షి) : రాష్ట్రంలోని ప్రజల సమాచారాన్ని ఐటీ కంపెనీలకు టీడీపీ ప్రభుత్వం దారాదత్తం చేసిందని, తద్వారా పెద్ద నేరానికి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం జిల్లాలోని కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, తన ఇష్టానుసారంగా వారి డేటాను ఐటీ కంపెనీలకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి, ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రజల సమాచారాన్ని టీడీపీ ఐటీ కంపెనీలకు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడిందని.. దీనిని ఎన్నికల సంఘం చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఐటీగ్రిడ్స్‌ స్కాంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ హస్తం ఉందన్నారు. ఇది ప్రజస్వామ్యంపై, ప్రజల ప్రాథమిక హక్కులపై జరిగిన దాడి అని అన్నారు. కొత్త పంథాలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయా కంపెనీల ఉద్యోగులకు జీతాలు ఎవరిస్తున్నారో, వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో విచారణ చేపట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టే సంస్కృతి ఏపీలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుది ఎంత క్రిమినల్‌ మైండ్‌ అనేది ఈ ఘటన ద్వారా అర్థమవుతుందని తెలిపారు. కాగ్‌ తప్పుపట్టినా, ప్రతిపక్షం ప్రశ్నించినా, జనాలు ఛీకొడుతున్నా.. చంద్రబాబు అక్రమాలు ఆపడం లేదన్నారు. చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.