ప్రారంభమైన కొచ్చి విమానాశ్రయం

– కేరళలో వరదల కారణంగా మూసివేత
– పదిహేను రోజుల అనంతరం తిరిగి ప్రారంభం
తిరువనంతపురం, ఆగస్టు29(జ‌నం సాక్షి) : కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం బుధవారం మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో సంభవించిన భారీ వరదల కారణంగా విమానాశ్రయ పరిసరాలు, రన్‌వేలపై విపరీతంగా నీరు చేరడంతో విమాన రాకపోకలు కొనసాగించే పరిస్థితి లేక విమానాశ్రయాన్ని 15రోజుల పాటు మూసివేశారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 14వ తేదీ నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. పదిహేను రోజుల అనంతరం బుధవారం మధ్యాహ్నం మొదటి విమానం కొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో 667 విమానం మధ్యాహ్నం రెండు గంటలకు కొచ్చికి వచ్చింది. ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కేరళ భారీ వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల కారణంగా విమానాశ్రయం మూసేయడంతో ప్రభుత్వం వాణిజ్య విమానాలను కొన్నింటిని కొచ్చి నావికాస్థావరం నుంచి నడిపించింది. భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాన్ని ఆగస్టు 18వ తేదీ వరకు మూసేస్తున్నామని తొలుత అధికారులు ప్రకటించారు. కానీ, వరద తగ్గుముఖం పట్టకపోవడంతో దాన్ని ఆగస్టు 26, తర్వాత 29వ తేదీ వరకు పొడిగించారు. కొచ్చికి వెళ్లాల్సిన విమానాలను తిరువనంతపురం, కోజికోడ్‌, తమిళనాడులోని కోయంబత్తూర్‌, కర్ణాటకలోని మంగుళూరు విమానాశ్రయాలకు మళ్లించారు. వరదల కారణంగా పదిహేను రోజుల పాటు విమానాశ్రయం మూసేయడంతో కొచ్చి విమానాశ్రయానికి దాదాపు రూ.220కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.