ప్రియుడిని చంపి వండి వడ్డించింది

అబుదాబిలో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన

పోలీసుల అదుపులో మహిళ

అబుదాబి,నవంబర్‌22(జ‌నంసాక్షి): విషయం వింటేనే వెన్నులో వణుకు పుట్టించే వార్త . ఒళ్లు గగుర్పొడిచే ఘటన..చెబితేనే నోటమాటరాని విషయం…అబుదాబిలో ఓ మొరాకో మహిళ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చంపి, అతన్ని ముక్కలుగా చేసింది. ఆ తర్వాత వాటితో ఓ బిర్యాని వంటకం వండి అక్కడున్న నిర్మాణ కార్మికులకు వడ్డించింది. యూఏఈలోని అల్‌ ఐన్‌ పట్టణంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. 30 ఏళ్ల ఈ మహిళ తన నేరాన్ని అంగీకరించింది. తనను వాడుకొని వదిలేశాడని పగ పెంచుకున్న ఆ మహిళ.. బోయ్‌ఫ్రెండ్‌పై పగ తీర్చుకోవాలని భావించినట్లు ఖలీజ్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అందులో భాగంగా అతన్ని చంపినట్లు ఆమె విచారణలో అంగీకరించింది. ఈ ఘటన కొన్ని నెలల కిందటే జరిగినా.. ఈ మధ్యే హతుని సోదరుడు అతన్ని వెతుక్కుంటే వాళ్ల ఇంటికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. తన సోదరుని గురించి మహిళను ఆరా తీయగా.. తనకు తెలియదని, అతనికి వేరే మహిళతో సంబంధం ఉన్న కారణంగా విడిపోయినట్లు ఆమె చెప్పింది. అయితే ఆమె ఇంట్లో ఉన్న బ్లెండర్‌లో ఓ మనిషి దంతం కనిపించడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా.. అసలు విషయమంతా బయటపడింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు.