ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు


– ఐదుగురి మృతి, తొమ్మిది మందికి గాయాలు
– హరియాణాలోని హిసార్‌లో విషాధ ఘటన
హిసార్‌, నవంబర్‌21(జ‌నంసాక్షి) : హరియాణాలోని హిసార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సవిూపంలోని వంతెన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి కారు దూసుకెళ్లింది. బుధవారం  తెల్లవారుజాము సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మృతులు బిహార్‌లోని సహర్సా, ఖగారియా జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. హన్సి ప్రాంతానికి వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పై పడుకున్న వారిపైకి దూసుకుపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆ ఓవర్‌బ్రిడ్జిపై మరమ్మతు పనులు జరుగుతున్నాయని, అక్కడ పనిచేసే కార్మికులు పని అయిపోయిన అనంతరం అక్కడే ఫుట్‌పాత్‌పై పడుకున్నారని పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కార్మికుల విూద నుంచి పోవడమే కాకుండా వంతెన రైలింగ్‌ ధ్వంసమవ్వడంతో 50 అడుగుల కిందకి పడిపోయిందని వెల్లడించారు. వంతెనపై నుంచి పడకముందు అది మరో కారును కూడా ఢీకొట్టిందని తెలిపారు. కారు డ్రైవర్‌ గాయపడ్డాడని చెప్పారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.