బంధుత్వాలు వేరు.. పార్టీ వేరు
– కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
– ఏపీ అభివృద్ధిలోకి రావడం జగన్, మోడీ, కేసీఆర్లకు ఇష్టం లేదు
– ఆ ముగ్గురు కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి
– అవంతిని బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారు
– టెలీకాన్ఫరెన్స్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి15(జనంసాక్షి) : బంధుత్వాలతో పార్టీని నడపలేమని, బంధుత్వాలు వేరు పార్టీ వేరని, తానెప్పుడూ బంధుత్వాలకు ప్రాధాన్యతనివ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని.. అందుకే ఆయనను బెదిరించారని చంద్రబాబు చెప్పారు. మొన్న తనతో ఢిల్లీలో తిరిగి నిన్న వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని ఆదేశించారు. తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల ముందు కూటమి అసాధ్యం అన్నారని, తాము ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామని చంద్రబాబు అన్నారు. కూటమితో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే కుట్రలు, కుతంత్రాలు పెంచారని విమర్శించారు. ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని కమిటీలు చెప్పాయని ఆయన తెలిపారు. అరకొర విపత్తు సాయాన్ని మొయిలీ కమిటీ నిలదీసిందని అన్నారు. తిత్లీ తుఫాను పరిహారం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందని చెప్పారు. విపత్తు సాయం ఏటా 15శాతం పెంచాలని మొయిలీ కమిటి చెప్పిందని పేర్కొన్నారు. హుద్హుద్ పరిహారం ఇంకా రూ.400 కోట్లు రావాలన్నారు. కేరళకు దుబాయ్ సాయం చేస్తానంటే కేంద్రం అడ్డుకుందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వదని.. ఇతరులను సాయం చేయనివ్వదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, మోదీ ఇద్దరినీ జగన్ కాదనలేరని… ఎందుకంటే ఇద్దరిలో ఎవరిని కాదన్నా జగన్ వెంటనే జైలుకు వెళ్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కాకూడదనేదే ముగ్గిరి ఆలోచన అని, ముగ్గురి కుట్రలను ప్రజాక్షఏత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ను మించి అమరావతి అభివృద్ధి చెందితే మనుగడ ఉండదనేది వారి భయమన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని, కేంద్రంతో చేసే యుద్ధంలో గెలుపే మన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.