బాబు మళ్లీ సిఎం కావాల్సి ఉంది

లేకుంటే అమరావతి తరలి వెళుతుంది: మంత్రి ప్రత్తిపాటి

గుంటూరు,జనవరి28(జ‌నంసాక్షి): చంద్రబాబు మళ్లీ సీఎం కాకపోతే రాజధాని వేరే ప్రాంతానికి వెళ్లిపోతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని అమరావతి అబివృద్ది, పోలవరం తదిరప్రాజెక్టులు పూర్తి కావాలంటే మళ్లీ బాబు సిఎంకావాల్సి ఉందన్నారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో ఎన్టీఆర్‌ స్వగృహ క్రింద ఇళ్లు కేటాయింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఓటేయకపోతే చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం శ్రమిస్తున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. అందుకే ఐదు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తుళ్లూరు మండల పరిధిలోని నాలుగు గ్రామాల్లో ఇళ్లు లేని 2,400 మందికి దాదాపు పది లక్షల రూపాయల విలువైన ప్లాట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. లబ్దిదారులు ఎవరూ ఇంటిని అమ్ముకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాజధాని ప్రజల్ని భయపెట్టేందుకు వైకాపా ప్రయత్నించినా ప్రజలు నమ్మలేదని, చంద్రబాబుకు మద్దతు పలిక భూములిచ్చారని గుర్తుచేశారు.