బిజెపి అభ్యర్థికి చేదు అనుభవం
పెద్దల ఆశీర్వాదం కోసం వంగడంతో చెప్పులదండ
తేరుకునే లోగా పారిపోతున్న వ్యక్తికి దేహశుద్ది
భోపాల్,నవంబర్20(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. అనూహ్యంగా ఓ వ్యక్తి మెడలో చెప్పుల దండ వేసి అవమాన పరిచాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు ఆ వ్యక్తికి దేహవుద్ది చేశారు. గ్రామస్థుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన భాజపా అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి అవమానపరిచాడు. మధ్యప్రదేశ్లోని నగడాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నగాడా-ఖచురాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపాకు చెందిన దిలీప్ సింగ్ షెఖావత్ బరిలోకి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆయన ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో అందరూ ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నిలబడి ఉన్న గ్రామస్థుల ఆశీర్వాదం తీసుకునేందుకు అభ్యర్థి కిందకు వంగారు. ఆ సమయంలో ఓ వ్యక్తి షెఖావత్ను కలిసేందుకు దగ్గరకు వచ్చి వెంటనే చెప్పుల దండను మెడలో వేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన షెఖావత్ అనుచరులు అతడిని పట్టుకొని కొట్టారు. అయితే.. అసలు ఆ వ్యక్తి అలా చేయడానికి గల కారణం తెలియరాలేదు. మధ్యప్రదేశ్లో నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.