బీసీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే
– వైసీపీ బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకుపుడుతుంది
– వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు, ఫిబ్రవరి18(జనంసాక్షి) : నాలుగున్నరేళ్లుగా బీసీలకు మాయమాటలు చెబుతూ మోసం చేసుకుంటూ వస్తున్న ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని, వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఐక్యమవుతున్నారని
చంద్రబాబుకు గుణపాఠం తప్పదని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బీసీలంటే చంద్రబాబు చులకనగా చూస్తున్నాడని, ఏం చెబితే అది నమ్మి ఓట్లేస్తారని భావిస్తున్నాడని అన్నారు. చంద్రబాబుకు గుణపాఠం తప్పదని, బాబు కుట్రలను బీసీలంతా గమనించారని అన్నారు. బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని తెలిపారు. సభ గ్రాండ్ సక్సెస్తో చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనై ఏదేదో మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. సభకు జనం రాలేదని, అట్టర్ ఫ్లాఫ్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అలా అంటే జనాలు నవ్వుతారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్కు మద్దతుగా బీసీలంతా సిద్ధంగా ఉన్నారని, 2019లో జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయితేనే టీడీపీ హయాంలో దగాపడ్డ బీసీ సోదరులంతా లాభపడుతారన్నారు. గత 40 ఏళ్లుగా టీడీపీ.. బీసీలను కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదన్నారు. వారి జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. ఐదేళ్లలో కేవలం రూ.18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేశారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల స్థితిగతులను మారుస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున మొత్తం ఐదేళ్లలో రూ. 75వేల కోట్లను బీసీల సంక్షేమానికి ఖర్చు చేస్తామని జగన్ స్పష్టం చేశారని అనిల్ యాదవ్ తెలిపారు.