బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు

కర్ణాటక  జనంసాక్షి

కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) ఉన్న సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో (KSR Railway station) ఆగి ఉన్న ఓ రైలులో ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి. ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (Udyan Express) శనివారం ఉదయం 5.45 గంటలకు చేరుకున్నది. ప్రయాణికులంతా దిగిన తర్వాత ప్లాట్‌ఫామ్‌ రైలును నిలిపిఉంచారు. అయితే ఉదయం 7.10 గంటలకు రైలులోని బీ1, బీ2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్‌లో పొగలు దట్టంగా అలముకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. రైలులో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఉదయం 7.10 గంటలకు ప్రమాదం జరిగితే.. అగ్నిమాపక సిబ్బంది 7.35 గంటలకు చేరుకున్నారని స్థానికులు తెలిపారు. అప్పటికే రైలు బోగీలు మొత్తం కాలిపోయాయని చెప్పారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.