భారత్‌లో విధాన నిర్ణయ సంక్షోభం!

వాషింగ్టన్‌, జూలై 6 : భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు స్వయం కృతాపరాధమేనని ఒక నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం విధాన సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంటోందని సంస్కరణలకు వ్యతిరేకత కనపరచుతోందని 2014 ఎన్నికలలోపు పరిస్థితి మారేది కష్టమని ఆ తర్వాత కూడా మారుతుందన్న ఆశలేదని ‘కేపిటల్‌ ఎకనామిక్స్‌’ తన నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆర్థిక శాస్త్ర పరిశోధన, కన్సల్టెన్సీలలో ఆ సంస్థకు మంచి పేరుంది. స్థూల జాతీయోత్పత్తి 9 సంవత్సరాలలో కనిష్టంగా 5.3 శాతం వద్ద ఈ ఏడాది త్రైమాసికానికి చేరుకున్నట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికపై చూస్తే ఇది 5 శాతం లోపేనని తెలిపింది. పెట్టుబడులు తగ్గిపోవటం ఇందుకు కారణమని వెల్లడించింది. అభివృద్ధి జరుగుతుందన్న ఆశ కూడా వెనక్కుపోయినట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే జిడిపిలోటు కేంద్ర బడ్జెట్‌లో 5.9 శాతం పెరిగిందని తెలిపింది. అయితే విదేశీమారక నిల్వలు భారీ స్థాయిలో ఉన్నాయని ఇవి 292 బిలియన్‌ డాలర్లమేరకు ఉన్నాయని తెలిపింది. కాని 2011 ఆగస్టులో ఇవి 30 బిలియన్‌ డాలర్లు తగ్గాయని వెల్లడించింది.