మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ కాన్వాయ్‌పై బిజెవైఎం దాడి

 

అగర్తలా,నవంబర్‌17(జ‌నంసాక్షి): త్రిపుర మాజీ సీఎం, సీపీఐ(ఎం) నాయకుడు మాణిక్‌ సర్కార్‌, ఆయన అనుచరుల కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బిషాల్‌ఘర్‌లో ఓ పబ్లిక్‌ విూటింగ్‌లో పాల్గొన్న అనంతరం మాణిక్‌ సర్కార్‌తో పాటు మిగతా నాయకులు తిరిగి బయల్దేరారు. ఈ సమయంలోనే వారి వాహనాలపై బీజేవైఎం కార్యకర్తలు దాడి చేయడంతో.. కొద్దిసేపు సీపీఐ(ఎం) కార్యాలయంలోనే మాణిక్‌ సర్కార్‌ ఉండాల్సి వచ్చింది. త్రిపురకు నాలుగుసార్లు సీఎంగా పని చేశారు మాణిక్‌ సర్కార్పై దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. మాణిక్‌ సర్కార్‌ కాన్వాయ్‌పై బీజేవైఎం కార్యకర్తలు దాడి చేయడాన్ని కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. ఆయన కాన్వాయ్‌పై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ఈ దేశంలో ప్రముఖ నేతల్లో మాణిక్‌ సర్కార్‌ కూడా ఒకరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ ఘటనను ఖండించి.. అప్రజాస్వామికవాదులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.