ముంబయిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

ముంబయి : దక్షిణ ముంబయిలోని ఓ మురికివాడలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహిమ్‌ ప్రాంతంలోని నయానగర్‌ మురికి వాడలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగి 50 గుడిసెలకు వ్యాపించాయి. నిద్రలో ఉన్న ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయి మృతి చెందినట్లు బీఎంసీ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏడు అగ్నిమాపక శకటాలు, ఎనిమిది ట్యాంక్‌లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో గల్లీలు ఇరుకుగా ఉండటంతో సహాయ చర్యలు చేపట్టడం ఆలస్యమవుతుందని వివరించారు. స్థానిక కాంగ్రెస్‌ ఎంపీ ఎక్‌నాథ్‌ గైక్వాడ్‌ ఘటనాస్థలాన్ని సందర్శంచి బాధితులను పరామర్శించారు.