మూసీ పేదలకు  మురికి నుంచి విముక్తం

` నదీపరివాహకంలో నివసిస్తున్న పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయింపు
` సూమారు 10 వేల కుటుంబాలకు పునరావాసం
` తద్వారా మూసీ ప్రాజెక్టు పనులకు మార్గం సుగమం
` ఇప్పటికే ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమిక ప్లానింగ్‌ పూర్తి
హైదరాబాద్‌(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎంమ్మెల్యేల సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్‌ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన విస్తృతంగా చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపైన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్‌ ఏన్‌ డిపి కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్‌ ఎన్‌ డి పి కార్యక్రమం తో పాటు మూసీ నదిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎమ్మెల్యేలుగా ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్ధితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసిపైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కోరారుప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా స్వయంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనపైన ఎమ్మెల్యేలను అభినందించిన మంత్రి కేటీఆర్‌, ఈ మేరకు ప్రభుత్వం మూసి నదిని అడ్డుగా ఉన్న అక్రమణల నుంచి విముక్తం చేసేందుకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను వాడుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుర్తించిన మూసీ నదిలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కేటాయిస్తుందని తెలిపారు. అత్యంత పేదరికం వలన మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల రూపంలో గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. దీంతోపాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు. మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి, మూసిని బలోపేతం చేస్తామని తెలిపారు. మూసీ అడ్డంకులు తొలగిన తర్వతా మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్‌  ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.మూసీ వరద నుంచి పేద ప్రజలను, నగరాన్ని కాపాడే ఉదాత్తమైన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలే స్వయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలపడం పట్ల మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డంకులను తొలగిస్తే భవిష్యత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు. ఎస్‌ ఎన్‌ డి పి రెండవ దశ కార్యక్రమానికి సంబందించిన పనులను త్వరలోనే మంజూరీ చేస్తామన్నారు. హైదరాబాద్‌ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతదన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కేటీఆర్‌, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఉన్నచోటనే నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. హైదరాబాద్‌ నగరంలో గత పది సంవత్సరాల లో జరిగిన విస్తృతమైన అభివృద్ధిని పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలును తమకు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని సందర్భంగా మంచి కేటీఆర్‌ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.