మేడిగడ్డపై సమగ్ర నివేదిక ఇవ్వండి

` గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చుల పూర్తి వివరాలివ్వండి
` జలవివాదాలపై ట్రిబ్యునల్స్‌ వద్ద గట్టి వాదన వినిపించాలి
` ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్‌ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సవిూక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఈఎన్‌ సీ మురళీధర్‌, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

21న కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటి
` గ్యారెంటీల అమలుపై చర్చించనున్న సమావేశం
హైదరాబాద్‌ (జనంసాక్షి): సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నెల 21వ తేదీన కలెక్టర్లతో కీలక సదస్సు నిర్వహించనున్నారు.ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి కాన్ఫరెన్స్‌ ఇదే. ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుతోపాటు భూ రికార్డులతో ముడిపడిన అంశాలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.