మొక్కల పెంపకంతోనే ఆరోగ్యకర వాతావరణం
అర్బన్ ఫారెస్ట్ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్ర
ఆదిలాబాద్,నవంబర్19 (జనంసాక్షి) : మనుషులకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు రావద్దంటే సమస్త జీవులకు ప్రాణాధారమైన అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలునాటి చిత్తశుద్ది చాటుకోవాలన్నారు. రూ.2 కోట్లతో చేపట్టిన మావల అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… భావి తరాలకు గాలి, నీరు, వర్షాలు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే విరివిగా మొక్కలను నాటి పెంచాలన్నారు. రేపటి పిల్లలకు ఆస్తులతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే పెద్ద ఆస్తి అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీ రక్షణ చర్యల వల్ల విస్తృత చర్చ జరిగి ప్రజల్లో అవగాహన పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని అడవులను కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింది, ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’ పేరుతో రిజర్వు ఫారెస్టులను అభివృద్ధి చేస్తుందన్నారు. పర్యాటకులు సైతం సందర్శించేందుకు వీలుగా పార్కుల్లో అదనపు హంగులు సమకూరుస్తున్నామని తెలిపారు. పార్క్ లు ఆహ్లాదకరంగా ఉండేలా స్థానికులు కూడా తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్థన్, కలెక్టర్ దివ్యా దేవరాజన్, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.