రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు

హైదరాబాద్: రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎన్నికల సమయంలో పాత కేసులతో కాంగ్రెస్ నేతలను అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు తెరాస చేతకానితనానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు పరిపాటిగా మారిందని కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డి విమర్శించారు. రేవంత్రెడ్డిపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన జూబ్లీహిల్స్లోని నివాసానికి కార్యకర్తలతో సహా చేరుకున్నారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ సర్కారు కాంగ్రెస్ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. సోదాలకు కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం భయపడేది లేదన్నారు.
రేవంత్రెడ్డి నివాసంలో ఐటీ సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దల ఇళ్లల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తే ఎవరి గుట్టు ఏంటో తెలుస్తుందన్నారు. కేసీఆర్ సర్కారు అణచివేత విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని భయపెట్టేందుకు మొన్న జగ్గారెడ్డిని, ఈరోజు రేవంత్రెడ్డిని టార్గెట్ చేశారన్నారు.