రాజమండ్రి కాలేజీలో మైనర్ల వివాహం

క్లాస్‌రూమ్‌లోనే ఒక్కటయిన స్నేహితులు
కలకలం రేపిన పెళ్లి ఘటన
కాకినాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ క్లాస్‌ రూమ్‌లో ఇద్దరు మైనర్ల పెళ్లి కలకలం సృష్టించింది. విద్యార్థులపై చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపల్‌ మేరీ సుజాత చెప్పారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ  కేవలం వాళ్లు సరదా కోసమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు విచారణలో తెలిందని కాలేజీ ప్రిన్సిపాల్‌ మేరీ సుజాత తెలిపారు. అయినా ఇలాంటి పనులు కాలేజీలో చేయడం తప్పని భావించి ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చి, వారికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచామని తెలిపారు. నవంబర్‌ 27న విద్యార్థుల తల్లిదండ్రులు పెళ్లి వీడియో తమ దృష్టికి తెచ్చారని ప్రిన్సిపాల్‌ మేరీ సుజాత చెప్పారు. దీనిపై తాము విచారణ జరిపినప్పుడు నవంబర్‌ 17వ తేదీ ఉదయం 8-30 గంటలకు ముగ్గురు విద్యార్థులు కాలేజీకి వచ్చి ఈ విధంగా చేస్తే లైక్‌లు ఎన్ని వస్తాయో చూద్దామని సరదాగా ఫ్రాంక్‌ వీడియో తీసుకున్నామని, తర్వాత భయం వేసి వెంటనే వీడియోను తొలగించామని విద్యార్థులు వ్రాతపూర్వకంగా ఇచ్చారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పినా వినడంలేదని, తాము సరదాగా తీసుకున్నదే తప్ప.. ఎలాంటి చెడు ఆలోచన లేదని విద్యార్థులు చెప్పారని ఆమె అన్నారు. కాలేజీ ఉదయం 9-30 తెరుస్తామని, అయినా వారు 8-30 గంటలకే కాలేజీకి వచ్చి ఫ్రాంక్‌ వీడియో తీయడం తప్పని భావిస్తూ.. వారికి టీసీ ఇచ్చి పంపిచామని ప్రిన్సిపల్‌ మేరీ సుజాత తెలిపారు.