రాహుల్‌తో భేటీ అయిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

తాజా రాజకీయాలపై చర్చ

కుంతియాతో కలసి వెల్లి కలసిన కొండా

23న సోనియా సమక్షంలో పార్టీలో చేరిక

కాంగ్రెస్‌లో చేరడం ద్వారా పనిచేసే అవకాశం

వెల్లడించిన విశ్వేశ్వర్‌ రెడ్డి

న్యూఢిల్లీ,నవంబర్‌21(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌లో ఉండి చేయలేకపోయిన అనేక పనులను కాంగ్రెస్‌లో చేరి చేయాలని అనుకుంటున్నానని తెరాసను వీడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గత రెండేళ్లుగా పార్టీలో ఇమడలేని పరిస్తితులు ఉన్నాయన్నారు. మంగళవారం పార్టీకి రాజీనామా చేసిన ఆయన బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి దిల్లీలో రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో వివరించారని సమాచారం. ఈ నెల 23న మేడ్చల్‌ సభలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితికి, చేవెళ్ల లోక్‌సభ స్థానానికి కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇందుకు దారితీసిన పరిస్థితులను వివరించడంతో పాటు ప్రధానంగా ఐదు కారణాలను ప్రస్తావిస్తూ మంగళవారం సాయంత్రం మూడు పేజీల లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఆయన రాశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశారు. రాహుల్‌తో సమావేశం అనంతరంమాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీని కలిశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ‘నిన్న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశాను. ఇప్పుడు రాహుల్‌ గాంధీని కలవడం సంతోషంగా ఉంది. 23వ తేదీన అధికారికంగా కాంగ్రెస్‌లో చేరుతున్నాను. ప్రజలు, ఉద్యమకారులు అందరూ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. అని ఆయన చెప్పారు. రాజీనామా అంశంపై స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్‌ ఇస్తానని తనకు హావిూ ఇవ్వాలని, రాజకీయంగా తన వర్గానికి అవకాశాలు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌ను కోరుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణ సిద్దాంతాలకు దూరమైందని, దానిని జీర్ణించుకోలేకనే పార్టీని వీడానని ఆయన తెలిపారు. మంత్రి మహేందర్‌ రెడ్డితో వ్యక్తిగత విభేదాల వల్లే పార్టీని వీడాలనే ప్రచారంలో నిజంలేదన్నారు. వ్యక్తిగత కారణాలు మొదటినుంచి ఉన్నాయని, కానీ, అందుకు మహేందర్‌రెడ్డితో విభేదాలు కారణం కాదన్నారు. ఈ నెల 23వ తేదీన సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన వెల్లడించారు. ‘చేవెళ్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూలు అమలు కాలేదు. నా నియోజకవర్గ సమస్యలు కాంగ్రెస్‌ పార్టీతో పరిష్కారమవుతాయని భావిస్తున్నా. రాహుల్‌ గాంధీతో సమావేశం మంచిగా జరిగింది. నియోజకవర్గ అంశాలు, రాష్ట్రంలోని అంశాలపై ఆయనతో మాట్లాడాను. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది’ అని తెలిపారు. కుంతియా మాట్లాడుతూ.. ఈ నెల 23న సోనియా, రాహుల్‌ సమక్షంలో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని, ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఆయన కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. చాలా రోజులుగా కొండా టీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొండా సరైన సమయం కోసం వేచిచూశారని, అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. తాను పార్టీని వీడేందుకు దారితీసిన కారణాలను తెలియజేస్తూ మూడు పేజీల లేఖ రాసిన కొండా.. రాజకీయాల్లోకి రావడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేనప్పటికీ అప్పటి అవసరానికి అనుగుణంగా తాను టీఆర్‌ఎస్‌లో చేరానని, క్రమంగా పార్టీలోని పరిస్థితులు తనను ఇబ్బందు లకు గురిచేశాయని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులను కేబినెట్‌లో చేర్చుకుని వారికే అన్ని అధికారాలు ఇచ్చారని, పార్టీలో తాను బలహీనుడిని అయిపోయానని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సమ్మతి కాదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కార్యాచరణ?సిద్దాంతాలను, భావాలు?సెంటిమెంట్‌ను వేరుచేసి తాను పనిచేయలేనని, అందుకే తీవ్ర బాధాకరం అయినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. క్రమంగా టీఆర్‌ఎస్‌ ప్రజలకు దూరమవుతోందని, ప్రభుత్వపరంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోందని కూడా ఆరోపించారు.