రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధరలు

– హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.84.09
– బెంబేలెత్తుతున్న వాహనదారులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : పెట్రోల్‌ ధరలు మళ్లీ మంటలు పుట్టిస్తున్నాయి. రోజురోజకు పెరుగుతూ పోతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రికార్డు స్థాయి ధరలతో పెట్రోల్‌ బంక్‌ వైపు చూసేందుకు వాహనదారులు బెంబెలేత్తిపోతున్నారు. వరుసగా పదోరోజు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దేశ రాజధానిలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 79.31, డీజిల్‌ ధర రూ. 71.34కు పెరిగింది. సోమవారం నాటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై 19 పైసలు పెరిగింది. ఇక ధరలు అధికంగా ఉండే ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 86.72, డీజిల్‌ రూ. 75.74 పలికింది. ఇక లీటర్‌ పెట్రోల్‌ ధర కోల్‌కతాలో రూ. 82.33, చెన్నైలో రూ. 82.41, హైదరాబాద్‌లో రూ. 84.09గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర కోల్‌కతాలో రూ. 74.29, చెన్నైలో రూ. 75.39, హైదరాబాద్‌లో రూ. 77.60 పలుకుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోండటం, ముడిచమురు ధర భారీగా పెరగడం వల్ల గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరుకుంటున్నాయి. ఇక ఇరాన్‌పై అమెరికా విధించే ఆంక్షల కారణంగా ముడిచమురు సరఫరా తగ్గుతుందన్నభయాలు కూడా ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ ధరల పెరుగుదలతో సామాన్యుల గుండెలు గుబేలుమంటున్నాయి.