రుణాలు అందించడంలో బ్యాంకుల నిర్లక్ష్యం?

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కంటున్న రైతులు
వరంగల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఇప్పటికే ఈ యాసంగి సీజన్‌ అదును దాటిపోతుంది.. నేటికీ రుణ లక్ష్యం చేరుకోలేదు. దీంతో పెట్టుబడి లేక రైతులు నానా పాట్లు పడాల్సి వస్తున్నది. సకాలంలో పంట రుణాలు అందక పోవడంతో రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంటల సాగు చేయడంలో
పెట్టుబడుల కోసం అప్పులు చేయడానికి వెనుకాడడం లేదు. వ్యవసాయ పెట్టుబడులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు,కూలీల డబ్బులు పెరిగిపోతున్నాయి. దీంతో ఏటేటా పంటలకు పెట్టుబడుల భారం పెరుగుతున్నది. డబ్బులు దొరకక రైతులు అదునుకు కలుపు, ఎరువులు, విత్తనాలు వేయడం లేదు. అయినా రైతులకు రుణపరిమితి పెంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలీచాలని రుణాలతో రైతులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్‌ వడ్డీవ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలందిస్తున్నారు. మళ్లీ పంటలను అమ్మిన తర్వాత చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల వడ్డీ వ్యాపారులు ష్యూరిటీ ఉంటే అప్పులు ఇస్తున్నారు. మరొకొన్ని చోట్ల బంగారం, వస్తువులు, ఇల్లు, స్థలాలకు సంబంధించిన కాగితాలు కుదువ పెట్టుకొని అప్పులు ఇస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. అంతేకాదు, అప్పుల వసూళ్లలో విషయంలో కొందరు వడ్డీ వ్యాపారులు అన్నదాతలను వేధిస్తుండడంతో తనువు చాలిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రుణమాఫీని చేసినా.. దానిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతులకు ప్రభుత్వం నుంచి సొమ్ము వచ్చినా వారి ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో అన్నదాతలకు పంట రుణాల కోసం పాట్లు పడుతున్నారు. కొన్ని బ్యాంకులు ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తున్నాయి. రుణమాఫీలో ఒక విడతనే రుణాలిచ్చిన బ్యాంక్‌లు, మిగతా విడుతలో మొండిచెయ్యి చూపుతున్నాయి. దీంతో యాసంగి దాటి, వానకాలం పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయినా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోతోంది. బ్యాంకులు రుణాల లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకున్నా.. అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణాలు ఇప్పించడంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నది. అయినా రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తామని చెబుతున్నా.. కొర్రీలు పెడుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. రైతులకు వడ్డీ లేకుండా రుణమాఫీని అమలు చేయాల్సి ఉన్నా.. చాలా బ్యాంకుల్లో వడ్డీని వసూలు చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.