రూ. 13,150 కోట్లతో జీహెచ్‌ఎంసీ అంచనా బడ్జెట్‌ 

– బడ్జెట్‌ అంచనాలను ఆమోదిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం
హైదరాబాద్‌,ఫిబ్రవరి26 (జ‌నంసాక్షి): రూ.13,150 కోట్లతో జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బడ్జెట్‌ 2018-19 కౌన్సిల్‌ సమావేశం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగింది. 2018-19 బడ్జెట్‌ అంచనాలను ఆమోదిస్తూ జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. ఈ సమావేశానికి కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ ప్రభాకర్‌, ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ 2018-19 వార్షిక ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ మొత్తాన్ని రూ. 13,150కోట్లకు చేసిన అంచనాలను ఆమోదిస్తూ జీహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం తీర్మాణించింది. ఈ మొత్తంలో రూ. 3,325కోట్లు (29శాతం) రెవెన్యూ ఆదాయం కాగా, క్యాపిటల్‌ రిసిప్ట్‌ జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ద్వారా 2751.86కోట్లు (20.93శాతం), క్యాపిటల్‌ రిసిప్ట్‌ కింద మూడు కార్పొరేషన్ల నుండి రూ. 7073.14కోట్లు (53.79శాతం)గా ఉన్నాయి. బడ్జెట్‌ మొత్తం రూ. 13,150కోట్లలో రెవెన్యూ వ్యయం 2,675కోట్లు (20.34శాతం), క్యాపిటల్‌ వ్యయం జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ నుండి రూ. 3401.86కోట్లు (25.87శాతం), మూడు కార్పొరేషన్ల నిధుల ద్వారా క్యాపిటల్‌ వ్యయం రూ. 7077.14కోట్లు (53.79శాతం)గా పేర్కొన్నారు. మూసి పరివాహక ప్రాంత అభివృద్ది కార్పొరేషన్‌, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌లకు జీహెచ్‌ఎంసీకి గ్రాంట్‌గా అత్యధికంగా రూ. 7073.14కోట్లు లభించనున్నాయి. వీటిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ కు రూ. 6317.64కోట్లు, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కు రూ. 377.75కోట్లు, మూసి నది సుందరీకరణకు రూ. 377.75కోట్లు కేటాయించారు. రెవెన్యూ రిసిప్ట్‌లలో రూ. 1725.20కోట్లు (51.89శాతం) పన్నుల ద్వారా లభించనుండగా రూ. 1033.17కోట్లు (31.07శాతం) ఫీజులు, యూజర్‌ చార్జీల ద్వారా లభించనున్నాయి. రెవెన్యూ వ్యయంలో అత్యధికంగా పరిపాలన సంబంధిత వ్యయం రూ. 1488.79కోట్లు (55.66శాతం) కాగా ఆపరేషన్‌, మెయింటనెన్స్‌కు రూ. 1043.90కోట్లు (39.02శాతం)గా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

తాజావార్తలు