రైల్లో మంటలు.. తప్పిన ప్రమాదం

– యశ్వంత్‌ పూర్‌ – టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిని మంటలు
– గొల్లప్రోలు వద్ద ఘటన
– అప్రమత్తమై బోగీలను తప్పించిన రైల్వే అధికారులు
– ప్రయాణీకులు సురక్షితం
కాకినాడ, మార్చి5(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌ జంక్షన్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం విూదుగా జార్ఖండ్‌లోని టాటానగర్‌ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ రైలులో వంట చేసే బోగీ ‘ప్యాంట్రీ కార్‌’ అగ్నికి ఆహుతైంది. బోగీలో మంటలను గమనించిన సిబ్బంది చైను లాగి రైలును ఆపడంతో పెను ముప్పు తప్పింది. మంటల్లో కాలుతోన్న ప్యాంట్రీ కారు నుంచి లోకో పైలట్‌ బోగీలను వేరుచేశారు. దీంతో మంటలు ఇతర బోగీలకు వ్యాపించలేదు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత 2 గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద చోటుచేసుకుంది. ప్రమాద విషయాన్ని రైలు సిబ్బంది అధికారులకు తెలియజేశారు. ఆ తరవాత కొంత సేపటికి రెండు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి రాత్రి 2 గంటలకంటే ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉంటారు. ప్యాంట్రీ కార్‌ సిబ్బంది సకాలంలో స్పందించారు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో విజయవాడ, విశాఖపట్నం విూదుగా వెళ్లే రైళ్లకు ఆటంకం ఏర్పడింది. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఘటనపై విజయవాడ డివిజన్‌ ఏడీఆర్‌ఎం రామరాజు మాట్లాడుతూ.. ‘తెల్లవారుజామున సుమారు 1.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు. గొల్లప్రోలు స్టేషన్‌ను దాటుతూ ఉండగా ప్యాంట్రీ కార్‌లో మంటలు వస్తుంటే వెంటనే సిబ్బంది, టీసీ చైన్‌ లాగి రైలును ఆపారు. స్టేషన్‌ స్టాఫ్‌, లోకో పైలట్‌ మా దగ్గర ఉన్న ఫైర్‌ ఎక్సింగ్యూషర్‌ సిలిండర్‌తో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారన్నారు. సాధ్యపడకపోవడంతో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారని, పిఠాపురం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని తెలిపారు. ఈ లోపల రైలు ముందు భాగాన్ని రావికంపాడు స్టేషన్‌కు పంపామని, వెనక భాగాన్ని వేరుచేసి పెట్టామని తెలిపారు. ప్యాంట్రీ కార్‌ నుంచి ఎస్‌1 కోచ్‌ను విడగొట్టడానికి వీలుపడదు. అందుకే దానిలో ఉన్న ప్రయాణికులను వేరే కంపార్ట్‌మెంట్లలో సర్దుబాటు చేసి పంపించామని వివరించారు.  రామరాజు వివరించారు.