రోడ్డు ప్రమాదాలపై పట్టింపు లేని అధికారులు

తరచూ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు శూన్యం

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఈ ఏడాది జాతీయ రహదారిపై 54 ప్రమాదాలు జరుగగా 26 మంది మరణించారు. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు. జిల్లాలో జాతీయ రహదారితో పాటు జిల్లా కేంద్రానికి సవిూపంలో ఉన్న రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నివారణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలపై రోడ్డు భద్రత కమిటీ సమావేశాల్లో ఉన్నతాధికారులు చర్చిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. నేషనల్‌ హైవేపై హాట్‌స్పాట్‌లను గుర్తించినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. గతంలో జరిగిన సమావేశాల్లో జాతీయ రహదారి విస్తరణ పనులు జరిగినప్పుడు పర్యవేక్షణ లోపం అవసరమైన చోట భద్రత చర్యలు చేపట్టకపోవడం లాంటి సమస్యలు ఎక్కువ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో చర్చించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలపై నేషనల్‌ హైవే అధికారులు మాత్రం తమకేవిూ పట్టనట్లు వ్యవహరిస్తాన్నారని స్థానికులు అంటున్నారు. జిల్లాలో జాతీయ రహదారి హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వరకు 44 జిల్లాల విూదుగా పోతున్నది. నేరడిగొండ మండలం వద్ద ప్రారంభమైన ఈ రోడ్డు జైనథ్‌ మండలం పెన్‌గంగా నది వరకు 80 కిలో విూటర్ల మేర విస్తరించి ఉంది. గతంలో నేషనల్‌ హైవే 7గా ఉన్న ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా విస్తరించి జాతీయ రహదారి 44గా మార్చారు. 2009లో ప్రారంభమైన నేషనల్‌ హైవే 44 పనులు 2011లో ముగిశాయి. విస్తరణ పనుల అనంతరం తొమ్మిది సంవత్సరాలుగా ఈ రోడ్డుపై రాకపోకలు సాగుతున్నాయి. ఈ రహదారి గుండా ఉత్తరాదితో పాటు దక్షణాది రాష్టాల్రకు రోజూ వందలాది వాహనాలు పోతుంటాయి. రోడ్డు పనుల్లో పలు లోపాలు జరుగడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న పట్టణాలతో పాటు పలు గ్రామాలకు బైపాస్‌లు నిర్మించారు. మిగతా గ్రామాల వద్ద బ్రిడ్జిలు నిర్మించి సర్వీస్‌ రోడ్లకు కలిపారు. జైనథ్‌ మండలం భోరజ్‌, జందాపూర్‌ రోడ్డు, దేవాపూర్‌ ఎక్స్‌రోడ్డు, మావల క్రాసింగ్‌, గుడిహత్నూర్‌ బ్రిడ్జి వద్ద రహదారి నిర్మాణం

సరిగా లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గుడిహత్నూర్‌, భోరజ్‌ చెక్‌పోస్టు సర్వీసు రోడ్డు ఎక్కువ దూరం లేకపోవడం మూలమలుపులు ఎక్కుగా ఉండడంతో ప్రజలకు రక్షణ లేకుండా పోతున్నది. పలు చోట్ల సర్వీస్‌ రోడ్లు, ప్రమాద సూచికలు, స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం, డివైడర్లు నిర్మాణం సైతం సరిగా లేపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నాగ్‌పూర్‌ హైదరాబాద్‌ జాతీయ రహదారి జిల్లాలో 80 కిలో విూటర్ల మేర విస్తరించి ఉన్నది. ఈ రహదారి గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 9 ఏండ్ల కిందట ఈ రోడ్డును విస్తరించగా నిర్మాణ పనుల్లో భాగంగా పలు లోపాలు వెలుగుచూశాయి. ఫలితంగా జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. గతంలో జరిగిన రోడ్డు భద్రత కమిటీ సమావేశాల్లో అధికారులు జిల్లాలోని జాతీయ రహదారితో పాటు ఇతర రోడ్లపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించినా ఆచరణలోకి రాలేదు. దేవాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద గ్రామానికి వెళ్లే దారి హైవేకు ఆనుకొని ఉండడంతో అక్కడ వాహనాలు మలిగేటప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గుడిహత్నూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వైపు వచ్చే వాహనదారులకు ఈ మూలమలుపు దగ్గరికి వచ్చేంత వరకు కనపడకపోవడం, ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వేగంగా వచ్చిన వాహనాలు మూలమలుపువద్ద ప్రమాదాలకు గురువుతున్నాయి. మావల ఎక్స్‌రోడ్డు వద్ద నిర్మించిన బైపాస్‌ అస్తవ్యస్తంగా ఉంది. గుడిహత్నూర్‌ వచ్చే వాహనదారులు ఆదిలాబాద్‌కు పోవాలంటే ఎక్కడి నుంచి టర్న్‌ తీసుకోవాలో తెలయడం లేదు. దీంతో మరోచోటికి పోయి వాహనాన్ని తిప్పే క్రమంగా బోల్తాపడడం, ఇతర వాహనాలను ఢీ కొనడం జరుగుతుంది. నేరడిగొండ మండలం రోల్‌ మామడ, కిష్టాపూర్‌, లింగట్ల, ఆరేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టివిటీ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.