లోక్సభ ఎన్నికల్లో బోగస్ ఓటింగ్ జరిగింది
– ఐదుగంటల తర్వాత భారీ ఎత్తున ఓటింగ్ నమోదైంది
– ఆటైంలో క్యూలో ఎంతమందికి కాల్చిట్టీలు ఇచ్చారో రికార్డులు బయట పెట్టాలి
– సీఈసీకి ఫిర్యాదు చేసిన టీపీసీసీ నేతలు
న్యూఢిల్లీ, మే3(జనంసాక్షి) : లోక్సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో బోగస్ ఓటింగ్ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి, మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్లు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం వారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు సీఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం పారదర్శక ఎన్నికలు అని, ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరుగకూడదని అన్నారు. నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్లలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్ కావడంపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. చేవెళ్లలో విచిత్రంగా మైనస్ ఐదు శాతం ఓట్లు నమోదయ్యాయి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. 5 గంటల తర్వాత క్యూలో ఉన్న ఎంతమందికి కాల్చిట్టీలు ఇచ్చారనే రికార్డులు బయట పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతోనే పోటీ చేసిందని, ఖమ్మంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ అవకతవకల్లో విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని మండిపడ్డారు. అనంతరం మర్రి శిశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఈవో రజత్కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 గంటల తర్వాత ఒక్కో నియోజకవర్గంలో లక్షల్లో ఓట్లు పడ్డాయన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రజత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోలింగ్ శాతం చెప్పారని మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు.
సాయంత్రం 5గంటల తరువాత బోగస్ ఓటింగ్ జరిగిందని సీఈసీకి తాము ఫిర్యాదు చేశామని, లోతుగా అధ్యయనం చేసి వాటి నిగ్గు తేలుస్తామన్నారని తెలిపారు.