వందేళ్లపాటు భూభారతి ఉండాలి

` సామాన్యలకు సైతం అర్థంకావాలి
` ఆ విధంగా పోర్టల్‌ రూపకల్పన చేయాలి
` భద్రతాపరమైన సమస్యలు రాకుండా అత్యాధునికంగా రూపొందించాలి
` అందుకోసం నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలి
` అధికారులను ఆదేశించి సీఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):వందేళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా భూభారతి వెబ్‌సైట్‌ ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో భూభారతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్‌సైట్‌ ఉండాలన్నారు. అత్యాధునికంగా రూపొందించాలని కోరారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఫైర్‌వాల్‌ ఉండాలన్న సీఎం.. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని తెలిపారు. భూభారతి పోర్టల్‌ను సోమవారం జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్‌ రెడ్డి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్‌ సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద్‌ సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.ముందుగా మూడు మండలాల్లో పైలట్‌గా భూభారతి అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. జూన్‌ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి అమలు చేస్తామని తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ఇది రెఫరండం అవుతుందన్నారు. మే మొదటి వారంలో గ్రామపాలనాధికారులను నియమిస్తామని చెప్పారు.

‘భూభారతి’ జాతికి అంకితం
` శాసనసభ ఎన్నికలకు పోర్టల్‌ రిఫరెండం
` మొదట 3 పైలట్‌ మండలాల ఎంపిక
` జూన్‌ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు
` రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్‌ అభివృద్ధి
` వచ్చేనెల మొదటివారం గ్రామపరిపాలనాధికారులు
` ధరణి పేరిట కొల్లగొట్టిన భూములపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌
` మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని, భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ,హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. ఆదివారం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. డాక్టర్‌ బి.ఆర్‌ .అంబేద్కర్‌ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు సోమవారం ఈ భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానిదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారంలో వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని మేమిచ్చిన హామీని విశ్వసించి ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం ఇందులో రెవెన్యూశాఖ మంత్రిగా తనకు భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు తన జన్మ ధన్యమైందన్నారు. రాష్ట్రంలో తొలుత మూడు జిల్లాలలోని మూడు మండలాలలో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేయబోతున్నాం. ఈ మూడు మండలాలలో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్‌ 2వ తేదీ నాటికి పూర్తిస్ధాయిలో అమలు చేస్తామని తెలిపారు.భూభారతి చట్టం 2029 శాసనసభ ఎన్నికలకు మాకు రిఫరెండమని గతంలో శాసనసభలోనే ప్రకటించడం జరిగిందని, ఇప్పుడు కూడా మరో మారు స్ఫష్టం చేస్తున్నానని తెలిపారు. భూములపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఒక భరోసా , భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించాం. గతంలో మాదిరిగా రాత్రికి రాత్రే ఇద్దరు వ్యక్తులు కలిసి చట్టాన్ని రూపొందిస్తే మా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రైతులు మేధావులు నిపుణులతో చర్చించి చట్టాన్ని రూపొందించాం.గతంలో చెప్పినట్లుగానే భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయిస్తామని తెలిపారు
ఒకేసారి పోర్టల్‌లో ప్రవేశించవద్దు
ఒకేసారి భూ యజమానులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్‌ను సందర్శించవద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. దీనివలన మొత్తం పోర్టల్‌ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేగాక కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్‌ను స్టక్‌ చేయాలని భావిస్తే తగు చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారని మంత్రి తెలిపారు. కేంద్రప్రభుత్వ ఎన్‌ ఐ సి ఆధ్యర్యంలో నిర్వహించే పోర్టల్‌ లో ఆధునిక అంశాలను జోడిస్తూ అత్యాధునిక వెర్షన్‌ను ప్రజలకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్‌ అభివృద్ది సాగుతుంది. వచ్చేనెల మొదటివారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అమలులోకి తెస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాం. గతంలో ధరణిని తీసుకువచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండా క్రమ క్రమంగా పోర్టల్‌ను అభివృద్ది చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం, పోర్టల్‌ అమలుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రయోగాత్మక గ్రామాలలో స్వయంగా తాను పర్యటిస్తానని మంత్రి పొంగులేటి వెల్లడిరచారు. అదేవిధంగా సంబంధిత మంత్రులు కూడా పర్యటిస్తారని తెలిపారు.అదేవిధంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయించాం. భూభారతిలో ఎమ్మార్వో స్ధాయి నుంచి సిసిఎల్‌ వరకు సుమారు ఐదు స్ధాయిలలో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరణ చేశాం. అంతేగాక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేస్తాం. తర్వాత కాలంలో సమస్యలు తగ్గితే ట్రిబ్యునల్స్‌ను కుదిస్తాం. ధరణిలో గతంలో ఉండే 33 మాడ్యూల్స్‌ను ఆరు మాడ్యూల్స్‌కు తగ్గించామని దీనివలస అందరికీ ఈ పోర్టల్‌ సులభతరంగా ఉంటుందన్నారు.

 

తాజావార్తలు