వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను


– అనారోగ్య కారణాల వల్ల దూరంగా ఉండాలనుకుంటున్నా
– సుష్మాస్వరాజ్‌ సంచలన నిర్ణయం
భోపాల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి) : తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడంలేదని స్పష్టంచేశారు. ఆరోగ్య పరమైన కారణాల వల్ల తాను ఇక ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సుష్మ తెలిపారని సమాచారం. ఈ విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, కానీ నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు నా మనసును సిద్ధం చేసుకున్నాను అని 66 ఏళ్ల సుష్మ తెలిపారు.
సుష్మాస్వరాజ్‌ మధ్యప్రదేశ్‌లోని విదిశ ఎంపీ. ఆమె ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ, టెలికమ్యూనికేషన్స్‌, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా పనిచేశారు. అయితే సుష్మ ఎన్నికలకు దూరంగా ఉంటే రాజ్యసభ ద్వారా అయినా ఆమెను పార్లమెంటుకు తీసుకురావాలని భాజపా వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. సుష్మాస్వరాజ్‌ 2016లో మధుమేహం కారణంగా కొన్ని నెలల పాటు అధికారిక విధుల నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది. సుష్మకు గతంలో కిడ్నీ మార్పిడి కూడా జరిగిన సంగతి తెలిసిందే.