వరంగల్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

వరంగల్‌,మే22(జ‌నం సాక్షి ):  తెలంగాణ రాష్ట్రానికి  సంబంధించిన ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రారంభమైంది. హన్మకొండలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన ర్యాలీ.. 10 రోజుల పాటు జరగనున్నది. మొత్తం 31 జిల్లాలకు చెందిన వందలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రన్నింగ్‌, జంపింగ్‌, సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ఆఫీసర్‌ పవన్‌ పురి తెలిపారు. మూడు రోజుల తర్వాత.. సోల్జర్‌, జనరల్‌ డ్యూటీ సోల్జర్‌, టెక్నికల్‌, స్క్రీనింగ్‌ టెస్టులు జరుపుతామని పురి చెప్పారు. ఆర్మీలో నియమ నిబంధనలకు లోబడే ఉద్యోగాలు వస్తాయని.. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభపెడితే నమ్మవద్దని స్పష్టం చేశారు.