వరుస ఘటనలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు
వసతి గృహాల ఆడిట్కు ఆదేశాలు
న్యూఢిల్లీ,ఆగస్ట్8(జనం సాక్షి):బీహార్లోని ముజఫర్పూర్, ఉత్తరప్రదేశ్లోని ఇండియోరియా జిల్లాల్లోని వసతి గృహాల్లోని బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలపై స్పందించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న 9వేల సంస్థలలో ఉన్న బాలికల వివరాలకు సంబంధించిన ఆడిట్ నివేదికను అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆడిట్ నివేదికలను వచ్చే రెండు నెలల్లోగా సమర్పించాల్సిందిగా ఆదేశించింది. వచ్చే ఆరు రోజుల వ్యవధిలో బాలికల వసతిగృహాలను నిర్వహిస్తున్న సంస్థలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించడానికి వీలుగా ఎన్సిపిసిఆర్కు అనుబంధంగా అనువైన నమూనాను తాను రూపొందించినట్లు స్త్రీ, శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ వెల్లడించారు. వసతి గృహాల్లో ఎంతమంది ఉంటున్నారు, వారికి అందించే సౌకర్యాలకు సంబంధించిన ప్రశ్నలతో ఈ ఆడిట్ను రూపొందించామని, వసతిగృహాల నిర్వాహకుల పూర్తి నేపథ్యంకు తనిఖీ చేయడానికి కూడా అవసరమైన ప్రశ్నలను రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు.
——————-