వర్షాలతో ముమ్మరమైన వ్యవసాయ పనులు

పత్తికే మొగ్గు చూపిన జిల్లా రైతులు

జనగామ,జూలై13(జ‌నం సాక్షి): వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. ఈనెలాఖరు వరకు అంచనా విస్తీర్ణానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ది. ఇప్పటికే వాణిజ్య పంటలు వేసుకున్న రైతులకు ఈ వర్షాలు ఊరటనివ్వగా, వర్షాధారంగా సాగుచేసే పత్తి, మొక్క జొన్న వంటి విత్తనాలు నాటే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. బావులు, బోర్ల కింద వరి నారుమళ్లు సిద్ధంగా ఉండటంతో కురుస్తున్న వర్షాలతో నాట్లు వేసుకునేందుకు అన్నదాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రైతుబంధు ద్వారా అందించిన పెట్టుబడి పంటసాయం డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచిన రైతులు తాజాగా కురుస్తున్న వర్షాలతో ముమ్మరంగా విత్తనాలు నాటుతున్నారు. ఈసారి వానలు ఆలస్యం అవుతాయనే ఆందోళనలో వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు వాతావరణం చల్లబడి మోస్తరు వానలు కురుస్తుంటంతో ఉపిరి పీల్చుకున్నారు. ఆలస్యంగా అయినా విత్తనాలు నాటేందుకు భూములు

అనుకూలంగా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నారుమడుల కోసం పొలం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తుండగా, తర్వాత వరి, మొక్కజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. గత ఏడాది వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 68వేల హెక్టార్లలో పత్తి సాగు చేయగా, ఈసారి 72,560 హెక్టార్లలో పత్తి సాగువుతుందని అంచనా వేశారు. ప్రధాన పంటగా పత్తితోపాటు వరి, మొక్కజొన్న, జొన్న, పెసర, కంది, జీలుగ పంటల సాగు కోసం వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు సిద్ధంగా ఉంచగా జూలై నెలలో కురిసే వర్షాలపై ఆధారపడి రైతులు విత్తనాలు వేసుకునేందుకు సిద్ధపడ్డారు.