వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ అరెస్ట్

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుచరుడు రమేశ్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71 నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన కోసం గత కొన్నిరోజులుగా పోలీసులు హైదరాబాదులోనూ, గన్నవరంలోనూ గాలిస్తున్నారు.

కాగా, వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ ను అధికారికంగా ప్రకటిస్తే, అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు ఓ కథనంలో పేర్కొన్నారు. దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.