విద్యుత్‌ తీగలు పడి ఖరీదైన బర్రెలు మృతి

లబోదిబోమంటున్న రైతులు

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై28(జ‌నం సాక్షి): విద్యుదాఘాతంతో ఎనిమిది బర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషాద సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంటలో శనివారం జరిగింది. ఓ పంట పొలంలో బర్రెల మంద మేతకు వెళ్లగా, అదే సమయంలో వాటిపై విద్యుత్‌ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బర్రెల యజమానులు తమకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పరిహరం ఇప్పించాలని వారు అధికారులను మొర పెట్టుకున్నారు. మండల రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హావిూ ఇచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.