విద్యుద్ఘాతంతో సోదరుల మృతి
అనంతపురం,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ఘటన వజ్రకరూర్ మండలం గొట్టిపాడులో శుక్రవారం జరిగింది. గొట్టిపాడుకు చెందిన వీరేశ్, చంద్ర అనే సోదరులు ఆరు ఎకరాల్లో మిరప పంటను సాగు చేస్తున్నారు. హాంద్రినీవా కాలువలో నీరు తగ్గింది. దీంతో మిరప పంటకు సాగు నీరు అందించేందుకు విద్యుత్ మోటారును బిగిస్తుండగా ఒక్క సారిగా విద్యుదాఘాతానికి గురై వీరేశ్, చంద్రలు అక్కడికక్కడే చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గొట్టిపాడులో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోస్టుమార్టం కోసం వీరేశ్, చంద్ర మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.